తిరుమల శ్రీవారి హుండీకి మరోసారి భారీగా ఆదాయం సమకూరింది. మార్చి నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గత నెలలో హుండీ కానుకలు రూ.118.49 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మార్చి నెలలో కూడా స్వామివారి ఆదాయం రూ.100 కోట్ల మార్క్ను దాటింది. 2022 మార్చి నెల నుంచి శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ను అందుకుంటోంది. ఏకంగా రెండేళ్ల పాటూ ఆ రికార్డు కొనసాగుతోంది.. అంటే 24 నెలలుగా రూ.100 కోట్ల ఆదాయం సమకూరింది.
తిరుమల శ్రీవారిని దర్శించకున్న భక్తుల సంఖ్య 21 లక్షలు కాగా.. తిరుమలలోని కౌంటర్లలో విక్రయించి లడ్డూల సంఖ్య 1.01 కోట్లు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం సముదాయంలో.. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 42.85 లక్షలు అని టీటీడీ తెలిపింది. కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.86 లక్షలుగా ఉంది. మరోవైపు ఎన్నికల కోడ్ రావడంతో.. తిరుమలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. కోడ్ రావడంతో టీటీడీ సిఫార్సు లేఖల్ని రద్దు చేసింది దీంతో గతంలో వీఐపీలు, సిఫార్సు లేఖలతో రద్దీగా కనిపించే తిరుమలలో.. సామాన్య భక్తులు శ్రీవారిని త్వరగా దర్శనం చేసుకుంటున్నారు.
ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం 8 నుంచి 8.25 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుంచి 7.45 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (ఏప్రిల్ 5) ఉదయం – ధ్వజారోహణం.. రాత్రి – పెద్దశేష వాహనం. అలాగే ఏప్రిల్ 6న ఉదయం – చిన్నశేష వాహనం.. రాత్రి – హంస వాహనం. ఏప్రిల్ 7న ఉదయం – సింహ వాహనం.. రాత్రి – ముత్యపుపందిరి వాహనం. ఏప్రిల్ 8న ఉదయం – కల్పవృక్ష వాహనం.. రాత్రి – సర్వభూపాల వాహనం. ఏప్రిల్ 9న ఉదయం – పల్లకీ ఉత్సవం.. రాత్రి – గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఏప్రిల్ 10న ఉదయం – హనుమంత వాహనం.. రాత్రి – గజ వాహనం. ఏప్రిల్ 11న ఉదయం – సూర్యప్రభ వాహనం.. రాత్రి – చంద్రప్రభ వాహనం. ఏప్రిల్ 12న ఉదయం – రథోత్సవం.. రాత్రి – అశ్వవాహనం. ఏప్రిల్ 13న ఉదయం – చక్రస్నానం.. రాత్రి – ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa