టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాకిచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ)కు చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో నమోదు చేసిన కేసులో.. సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. స్కిల్ కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా సీఐడీ పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీఎస్ఎస్డీసీ (ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ) అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఎపీఎస్ఎస్డీసీ అప్పటి డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణ, సీమెన్స్, డిజైన్ టెక్, పీవీఎస్పీ స్కిలర్ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ పేర్కొంది. ఈ కుట్రలో నాటి మంత్రితో పాటు గంటా శ్రీనివాస్ రావు పాత్ర కూడా ఉందన్నారు.
ఈ ఛార్జ్షీట్ వ్యవహారంపై ఏసీబీ కోర్టు న్యాయాధికారి.. చెక్ అండ్ పుటప్ అని రాసి ఏవో పరిశీలనకు పంపారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగంలో నిందితుల పాత్ర ఉందని సీఐడీ ఛార్జిషీట్లో పేర్కొంది. కుట్రలో భాగంగా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగం విషయంలో 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబునాయుడి పేరును ఒక్కసారిగా తెరపైకి తెచ్చి 37వ నిందితుడిగా పేర్కొంటూ 2023 సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఆయనను సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. 53 రోజుల పాటు కారాగార జీవితం గడిపారు. అనంతరం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోని కారణంగా.. తనపై కేసు నమోదు చేయడం, దర్యాప్తు జరపడం చెల్లదని, స్కిల్ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులిచ్చింది. దీంతో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ వ్యవహారం విస్తృత ధర్మాసనానికి చేరిన విషయం తెలిసిందే.
మరోవైపు ప్రజాప్రతినిధులపై దాఖలు చేసే ఛార్జిషీట్ను న్యాయస్థానం విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవాలంటే (కాగ్నిజెన్స్) కాంపిటెంట్ అథారిటీ నుంచి (ప్రస్తుత కేసులో గవర్నర్ నుంచి) అనుమతి తప్పనిసరని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 చెబుతోంది. ఈ విషయాన్ని సీఐడీ అధికారులు విస్మరించి ఛార్జ్షీట్ దాఖలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతి లేనందున ఛార్జిషీటును కోర్టు.. రిటర్న్ చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa