నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-ఎన్సీఈఆర్టీ తాజాగా ముద్రించిన పుస్తకాలను విడుదల చేసింది. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం సార్వత్రిక ఎన్నికల వేళ పెను సంచలనంగా మారింది. దేశంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న కీలక ఘటనలకు సంబంధించిన విషయాల్లో మార్పులు చేయడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్సీఈఆర్టీ మార్చిన సిలబస్ ప్రకారం అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్లో ముస్లింల ఊచకోత, హిందుత్వ రాజకీయాలు వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. అయితే ఇది సాధారణ సిలబస్ మార్పుల్లో భాగమేనని ఎన్సీఈఆర్టీ అధికారులు వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కావాలనే మోదీ సర్కార్ ఇలాంటివి చేస్తోందని.. గత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయకుండా అడ్డుకుంటోందని మండిపడ్డాయి.
ఎన్సీఈఆర్టీకి చెందిన పాఠ్యాంశాల ముసాయిదా కమిటీ సిద్ధం చేసిన మార్పులను ఓ డాక్యుమెంట్లో వివరించారు. పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో బాబ్రీ కూల్చివేత ప్రస్తావన ఉన్న పుస్తకంలో 3 చోట్ల మార్పులు చేయాలని ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. దీనికి బదులుగా రామమందిర ఉద్యమాన్ని బోధించనున్నారు. దీంతో పాటు రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పునిచ్చిందో కూడా వివరంగా వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ రాజకీయాలు పేరుతో ఉన్న 8వ అధ్యాయంలో ఈ మార్పు చేసింది. ఈ అధ్యాయం 2006-2007లో పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో చేర్చారు.
అంతేకాకుండా హిందుత్వ రాజకీయ అంశాలను ఉపసంహరించుకున్నారు. గతంలో 11వ తరగతి పాఠ్యపుస్తకంలో చాప్టర్ 8లో సెక్యులరిజం గురించి ప్రస్తావిస్తూ.. 2002లో గుజరాత్లోని గోద్రా అల్లర్ల అనంతరం 1000 మందికి పైగా చనిపోయారని.. ముఖ్యంగా ముస్లింలను ఊచకోత కోశారు అని ఉండేది. ప్రస్తుతం దాన్ని కొద్దిగా మార్చేశారు. 2002లో గుజరాత్లోని గోద్రా అల్లర్ల తర్వాత 1000 మందికిపైగా చనిపోయారు అని మార్చారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని అంశాలను తాజాగా ఎన్సీఈఆర్టీ మార్చింది. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఈ ప్రాంతం అక్రమ ఆక్రమణలో ఉందని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ పాకిస్తాన్ గా అభివర్ణింస్తుంది అని ఉండేది. దీన్ని మారుస్తూ.. ఇది పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, దీనిని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని పిలుస్తారని మార్పు చేసింది. ఇక భారత్లో మణిపుర్ విలీనానికి సంబంధించిన సూచనను కూడా మార్పు చేశారు. ఈ మార్పులు ఇతర తరగతులతో పాటు 11, 12వ తరగతులకు సంబంధించిన రాజనీతి శాస్త్రం పాఠ్యాంశాల్లో కూడా చేశారు.
ఈ విషయమై ఎన్సీఈఆర్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇది మామూలుగా జరిగే నవీకరణేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పులతో కొత్త పుస్తకాలు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులను గురువారం వెబ్సైట్లో ఎన్సీఈఆర్టీ పొందుపరిచింది. సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఎన్సీఈఆర్టీ పుస్తకాల సిలబస్ను బోధించనున్నారు. దేశంలో 30 వేలకు వరకు సీబీఎస్సీ స్కూల్స్ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa