యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటి సివిల్స్కు ఎంపిక కావాలంటే ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉండాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మద్దతు తప్పనిసరిగా కావాలి. ఏళ్లకేళ్లు కష్టపడి చదివిన వారు కూడా అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం చాలా కష్టమే. అలాంటిది ఓ వ్యక్తి తాను సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నట్లు కనీసం ఇంట్లో కూడా చెప్పలేదు. పరీక్ష రాసిన విషయం కూడా ఆయన తల్లిదండ్రులకు తెలియదు. కట్ చేస్తే ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా 4 వ ర్యాంకు సాధించి అందర్నీ షాక్కు గురి చేశారు. మీడియాలో న్యూస్ పేపర్లలో తమ కుమారుడు యూపీఎస్సీ ఫలితాల్లో 4 వ ర్యాంకు సాధించాడని వచ్చిన వార్త చూసి అతని తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. అసలు విషయం తెలిసి సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే సిద్ధార్థ్ రామ్కుమార్ గతంలోనే ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఐపీఎస్ ట్రైనింగ్లోనే ఉండగా.. 4 వ ర్యాంక్ రావడం విశేషం.
కేరళకు చెందిన సిద్ధార్థ్ రామ్కుమార్ సివిల్స్లో నాలుగో ర్యాంక్ సాధించి.. తన కుటుంబాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తారు. సివిల్స్-2023 తుది ఫలితాల్లో సిద్ధార్థ్ రామ్కుమార్కు నాలుగో ర్యాంక్ వచ్చినట్లు మీడియాలో వచ్చేవరకు ఆయన పరీక్ష రాసిన విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. దీనిపై ఆయన తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమారుడు ఈసారి సివిల్స్ పరీక్ష రాసిన విషయం కూడా తమకు తెలియదని పేర్కొన్నారు. ఇక పరీక్షలో పాస్ అయి.. ఇంటర్వ్యూకు వెళ్లిన సంగతి కూడా తమకు చెప్పలేదని తెలిపారు.
ఇక ఇటీవల రిజల్డ్స్ విడుదలై టీవీలో పేరు కనిపించినప్పుడే తమకు జరిగిన విషయం మొత్తం తెలిసిందని పేర్కొన్నారు. ఇంటికి వచ్చి పరీక్షలు రాసినా.. తమకు ఆ విషయం.. సిద్ధార్థ్ రామ్కుమార్ తెలియనివ్వలేదని చెప్పారు. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత ఫోన్ చేసి కొద్దిసేపే మాట్లాడినట్లు సిద్ధార్థ్ రామ్కుమార్ తల్లి చెప్పింది. ప్రస్తుతం తన కుమారుడు ఐపీఎస్ ట్రైనింగ్ను వదిలిపెట్టి ఐఏఎస్లో చేరతారని ఆమె తెలిపారు. ఇక సిద్ధార్థ్ రామ్కుమార్ తండ్రి ఇది తాము అసలు ఊహించలేదని అన్నారు. ఇలాంటి అనూహ్య సంఘటనలు ఎదురైతే తమ సంతోషం డబుల్ అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇండియన్ టెలీకమ్యూనికేషన్ సర్వీస్లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సిద్ధార్థ్ రామ్కుమార్.. ఈ యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనే సివిల్స్ రాసి సెలక్ట్ అయిన సిద్ధార్థ్.. ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఐపీఎస్ అకాడమీలో శిక్షణ కూడా పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఐఏఎస్ కావాలని మరోసారి సివిల్స్ రాసి ఆల్ ఇండియా 4 వ ర్యాంక్ సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa