టీటీడీ గోవింద కోటి పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవారి ఆలయం నుంచి తొలి అడుగు వేసింది. అందుకే తొలిసారిగా రామకోటి తరహాలో గోవింద కోటిని తీసుకొచ్చింది. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక మొదటి గోవింది కోటిని పూర్తి చేశారు. కీర్తన 6 నెలల వ్యవధిలోనే 1001116 సార్లు గోవింద నామాన్ని రాసి ఆ పుస్తకాన్ని తిరుమలలోని ఆర్జితం కార్యాలయంలో సమర్పించారు. దీంతో పాలకమండలి నిర్ణయం మేరకు కీర్తనతో పాటుగా బాలిక కుటుంబ సభ్యులకు శ్రీవారి విఐపీ బ్రేక్ దర్శనభాగ్యం కల్పించింది టీటీడీ.
మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కీర్తన కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని. మొక్కులు సమర్పించుకున్నారు. టీటీడీ ప్రవేశ పెట్టిన గోవింద కోటిని మొట్ట మొదటిగా రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు కీర్తన. తమ కుటుంబ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద కోటి రాయాలని అనుకున్నానని.. తానే మొదటి వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో భక్తి భావంతో 1001116 సార్లు స్వామి వారి నామాలు రాసి టీటీడీకి సమర్పించానన్నారు.
టీటీడీ రామకోటి తరహాలో గోవింద కోటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గోవింద కోటిని పూర్తి చేసే 25 ఏళ్ల లోపు వారికి వారు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. అది కూడా ఆ కుటుంబంలో ఐదుగురితో బ్రేక్ దర్శనం, వసతి కల్పిస్తారు. ఈ మేరకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. వివరంగా చెప్పాలంటే.. మొత్తం1001116 సార్లు గోవిందనామం రాసినవారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు.
మే 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3 నుండి 21వ తేదీ వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగనుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 12వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.
మే 23న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగం
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో మే 23వ తేదీ పత్రపుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం మే 22వ తేదీన సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మే 23న ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్రపుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలు, పత్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పత్రపుష్పయాగంలో పాల్గొనవచ్చు. ఈ ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో అర్చక పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన పొరబాట్లకు ప్రాయశ్చిత్తంగా పత్రపుష్పయాగం నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa