ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.ఓటర్ల సంఖ్య, ఎన్నికల కేంద్రాలు, ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితా అంశంపై ముకేష్ కుమార్ మీనా విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రం ద్వారా 1500 మంది ఓటేయవచ్చన్న ముకేష్ కుమార్ మీనా.. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు ముకేష్ కుమార్ మీనా చెప్పారు
ఏపీ ఎన్నికలకు సంబంధించి కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నట్లు ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే అందులో కేవలం మూడు శాతం మాత్రమే ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి ( మే 2) హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని.. మే 8వ తేదీ వరకూ హోం ఓటింగ్ కొనసాగుతుందని మీనా వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా హోం ఓటింగ్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. అయితే ఏపీలో దీనికి అంతగా స్పందన లభించలేదు.
మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 864 కేసులు నమోదయ్యాయని ..72,416 మందిని బైండోవర్ చేసినట్లు ఏపీ సీఈవో తెలిపారు. అలాగే ఇప్పటివరకూ ఏపీవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో రూ. 203 కోట్లు పట్టుబడినట్లు వెల్లడించారు. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు ముకేష్ కుమార్ మీనా తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీలో 3, 93, 45, 717 వేల మంది ఓటర్లు ఉండగా.. ఈసారి ఓటర్లు 4 కోట్లకు దాటిపోయారు.
ఏపీలో14 సమస్యాత్మక నియోజకవర్గాలు
మరోవైపు ఏపీవ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో100% వెబ్కాస్టింగ్తో పాటు.. భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa