మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకేసు గురించి ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కడప కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ వివేకా కుమార్తె సునీత, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరుఫున మురళీధర్రావు, గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అయితే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను సునీత జిల్లా కోర్టులోనే అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అప్పీల్ పిటిషన్ల మీద విచారణ జరపాలని హైకోర్టు.. కడప జిల్లా కోర్టును ఆదేశించింది.అలాగే మే 8వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలంటూ జిల్లా కోర్టుకు ఆదేశాలు జారీచేసింది. అనంతరం హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
వివేకా హత్యకేసు అంశం కడప రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వైఎస్ షర్మిల.. ఈ అంశంలో సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. అటు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కూడా ఇదే కేసులో అవినాష్, వైఎస్ జగన్ మీద విమర్శలు సంధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను ఇటీవల విచారించిన కడప జిల్లా కోర్టు వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. అలాగే కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులపైనే షర్మిల, సునీత హైకోర్టును ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa