ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇటు అధికార వైసీపీకి, అటు విపక్ష టీడీపీ కూటమికి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి. దీంతో రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు.. అదే స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో వందకోట్లకు పైబడిన కోటీశ్వరులు అనేక మంది బరిలో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా శతకోటీశ్వరులు ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఏపీలో చట్టసభలకు పోటీచేస్తున్న శతకోటీశ్వరుల వివరాలు, టాప్ 10 రిచెస్ట్ అభ్యర్థులను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి.
లోక్ సభ నియోజకవర్గాలకు పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థుల సంగతిని పరిశీలిస్తే.. అందరికీ అందనంత ఎత్తులో టీడీపీ లీడర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. గుంటూరు లోక్ సభ నియోజవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ.5,785 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈయన తర్వాతి స్థానంలోనూ టీడీపీ అభ్యర్థే ఉన్నారు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 716.31 కోట్లతో రెండో ప్లేసులో ఉన్నారు. మూడో స్థానంలోనూ కూటమి అభ్యర్థే ఉండటం విశేషం. అనకాపల్లి లోక్ సభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్.. తనకు రూ. 497.59 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఏపీలోని టాప్ 10 సంపన్న ఎంపీ అభ్యర్థుల జాబితాలో.. నాలుగో స్థానంలో హీరో నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఉన్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్.. తనకు రూ.393.41 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఇక ఐదోప్లేసులో రాజంపేట లోక్ సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డికి రూ.209.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
అభ్యర్థి పార్టీ లోక్సభ నియోజకవర్గం ఆస్తులు
పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ గుంటూరు రూ.5,785 కోట్లు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు రూ. 716.31 కోట్లు
సీఎం రమేష్ బీజేపీ అనకాపల్లి రూ. 497.59 కోట్లు
శ్రీభరత్ టీడీపీ విశాఖపట్నం రూ.393.41 కోట్లు
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ రాజంపేట రూ.209.53 కోట్లు
పోచా బ్రహ్మానందరెడ్డి వైసీపీ నంద్యాల రూ.147.74 కోట్లు
సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ మచిలీపట్నం రూ.138.41 కోట్లు
వి. బాలశౌరి జనసేన మచిలీపట్నం రూ. 133.71 కోట్లు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ కడప రూ.132 కోట్లు
ఆరోస్థానంలో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయనకు రూ.147.74 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రూ.138.41 కోట్లతో ఏడోస్థానంలో ఉండగా.. అదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి బాలశౌరి రూ. 133.71 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. తొమ్మిదో స్థానంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉన్నారు. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేస్తున్న షర్మిల.. తనకు రూ. 132 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa