దుర్మార్గపూరిత రాజకీయాలతో తెలుగు బాషను, దేవాలయాలను, నదీ జలాలను అన్నింటినీ కలుషితం చేశారని.. దీనికి బాధపడే రాజకీయ పార్టీ స్థాపించానని సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తెలిపారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తన పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ఇంకా గుర్తింపు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. తనకు వీణ గుర్తు కేటాయించారని తెలిపారు. కులాలను విభజించి, బిస్కెట్లు వేసి.. జనంతో ఆడుకుంటూ రెండు, మూడు కులాల వారే దశాబ్దాలుగా పాలిస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇలాంటి దుర్మార్గాలకు స్పందించకుంటే అడవిలో ఉన్నా ఒకటే.. ఎడారుల్లో, ఏదో దీవిలో ఉన్నా ఒకటే’ అంటూ జొన్నవిత్తుల మండిపడ్డారు. కవిగా ఇలాంటి వాటికి బాధపడే రాజకీయ పార్టీ స్థాపించానని తెలిపారు.
‘ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు 40 లక్షల రూపాయలు దాటకూడదు. కానీ, నామినేషన్ వేసేందుకు కోటి, కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల్లో మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారో ఊహించుకోవచ్చు. కుటిల వ్యూహాలతో ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ నియమావళికి లోబడి ఖర్చు చేస్తే.. స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం ఉంటుంది’ అని జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు.
‘దమ్ముంటే రాజీనామా చెయ్ అంటూ అసెంబ్లీలో సవాళ్లు విసురుకుంటారు. దమ్ముంటే ధర్మంగా రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. మీ నీతి, నిజాయతీ నిరూపించుకోరా? ఉన్నత విలువలలో పోటీకి దిగరా..? సారాయి, డబ్బుతో ఓట్లను కొంటారా? అరాచకం చేసి సుఖపడినవాడు చరిత్రలో లేడు’ అంటూ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు విలువ గురించి, రాజకీయ నాయకుల గురించి వివరిస్తూ ఓ గేయాన్ని కూడా రాశారు జొన్నవిత్తుల. ఆ గేయాన్ని పాడి వినిపించారు. తనతో పాటు శతావధాని శ్యామలానంద ప్రసాద్ సైతం ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని జొన్నవిత్తుల తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్యామలానంద ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారని చెప్పారు.
జొన్నవిత్తుల ఇప్పటివరకూ 600కు పైగా సినిమా పాటలు రాశారు. పేరడీ పాటలతోనూ పాపులర్ అయ్యారు. తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద పలు పాటలు రాశారు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా ‘పెళ్ళాం పిచ్చోడు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాశారు జొన్నవిత్తుల. ఈ గీతాన్ని వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గతంలో బీజేపీ పార్టీలో చేరి, కొంతకాలానికే బయటికి వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa