ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 09:35 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాదిమంది సందర్శిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో తిరుమల కొండలకు చేరుకుని ఆ శ్రీనివాసుడి కటాక్షం కోసం వేచిచూస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం మాత్రమే కొంతమంది వస్తే.. తిరుమలలో ఒకటి రెండు రోజులు ఉండి కొండపై ఉన్న విశేషాలను దర్శించుకోవాలని మరికొంత మంది భక్తులు భావిస్తూ ఉంటారు. ఇందుకోసం తిరుమల కొండపై ఉన్న అద్దె గదుల కోసం బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు, అయితే ఆన్‌లైన్లో గదులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిపై ఈవోను కొంతమంది భక్తులు ప్రశ్నించగా.. ఆయన కీలక వివరాలు వెల్లడించారు.


మే మూడో తేదీన టీటీడీ ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం నిర్వహించారు.తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వనంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు, ఇతర సౌకర్యాలను పలువురు భక్తులు ప్రశంసించారు. అలాగే పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ భక్తులు కొంతమంది ఆన్‌లైన్లో గదులు దొరకడం లేదని ఈవో దృష్టికి తీసుకువచ్చారు. దర్శన టికెట్ బుక్ చేసుకున్నామని.. ఆన్‌లైన్‌లో మాత్రం గదులు దొరకడం లేదని తమ బాధలు చెప్పుకున్నారు.


దీనికి బదులిచ్చిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. గదులను బుక్ చేసుకునే విషయంలో కీలక వివరాలు వెల్లడించారు. తిరుమలలో 7500 గదులు మాత్రమే ఉన్నాయన్న ఈవో ధర్మారెడ్డి.. ఇందులో 50 శాతం గదులు ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్‌లో కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో గదులు దొరకని భక్తులు తిరుమలలో సిఆర్వోలో నమోదు చేసుకుని గదులు పొందవచ్చని చెప్పారు. అలాగే తిరుపతిలో కూడా గదులు పొందే అవకాశం ఉందని చెప్పారు.


మరికొంతమంది భక్తులు శ్రీవారి సేవా కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల అయిన వెంటనే అన్ని తేదీలు బ్లాక్ అవుతోందని ఈవో దృష్టికి తెచ్చారు. బఫరింగ్ అవుతోందని.. దీంతో పారదర్శకత లోపించిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అయితే శ్రీవారి సేవ ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఎంతో పారదర్శకతతో రూపొందించామన్న ఈవో.. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa