ఏపీలో ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ లీడర్ల మాటల ఘాటు పెరుగుతోంది. తాజాగా మంత్రి రోజాపై.. సినీ నటడు, కమెడియన్ పృథ్విరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కూటమి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు తరుఫున కమెడియన్ పృథ్వి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన పృథ్వి.. వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, మంత్రి రోజాపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలపై కమెడియన్ పృథ్వి సెటైర్లు వేశారు. తానే ఆయన పేరును రెడ్డికాపుగా మారుస్తున్నానంటూ ఎద్దేవా చేశారు." పిఠాపురంలో కూర్చుంటాం.. పవన కళ్యాణ్ను ఓడిస్తామంటున్నాడు. ఎక్కడ గుడిమెట్ల మీద కూర్చుంటావా. నేను డిగ్రీ వరకూ ఇక్కడే చదివా. యూనివర్సిటీలో ఉన్నప్పుడు కిర్లంపూడి పక్కన కాపు నాయకుడు ఉన్నాడంటే దండం పెట్టేవాళ్లం. అదంతా ఉట్టిదేనని తెలిసింది. ముద్రగడకు అసలు సిగ్గుందా. ముద్రగడకు రెడ్డికాపు అని నేనే పేరు పెట్టా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఊడిగం చేసే పాలేరువు నువ్వు. వైఎస్ జగన్ సంగతికి నీకు ఏం తెలుసు? పదేళ్లు ఆయనతో కాపురం చేశా. నాకు తెలుసు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటే వైఎస్ జగన్ సాధ్యమా అని అంటున్నారు. మీరు నవరత్నాలు ప్రకటించినప్పుడు మేము ప్రశ్నిస్తే సాధ్యమేనని చెప్పలేదా".
అని కమెడియన్ పృథ్వి ప్రశ్నించారు.
ఇదే సమయంలో మంత్రి రోజాపైనా పృథ్వి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ షోలో అవకాశాల కోసం తిరిగిన రోజాకు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గురివింద గింజకు తన నలుపు తనకు తెలియదన్నట్లు.. రోజా కూడా తన తప్పులు తనకు తెలుసుకోలేదంటూ అభిప్రాయపడ్డారు. "చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు రోజా మాట్లాడిన పరుష పదజాలం అందరికీ గుర్తుంది. చంద్రబాబు జైళ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు వెళ్తే.. ఓ దరిద్రుడు జైలుకెళ్తే మరో దరిద్రుడు పరామర్శకు వచ్చారంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలలో ఎవరూ అలాంటి మాటలు మాట్లాడలేదు. రోజాకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదు. పెద్దిరెడ్డి కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. జబర్దస్త్లో అవకాశాల కోసం తిరిగిన రోజా.. ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారు. రోజా గోల పడలేక ఆమె భర్త కూడా మద్రాసులో ఏడుస్తున్నారు. గురివింద చందాన మన తప్పులు మనం చూసుకోం. రోజా కూడా అంతేనని" నటుడు పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి పదే పదే మాట్లాడే అంబటి రాంబాబు.. ఆయన చెల్లెల్ని ఏమైనా పవన్ కళ్యాణ్కు ఇచ్చి పెళ్లి చేశారా అని ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో విడిపోతే మీకు వచ్చిన బాధ ఏమిటని పృథ్విరాజ్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa