ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తూర్పు’లో గెలిస్తేనే సీఎం పీఠం.. 19 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 09:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి. గోదావరి జలాలు, పాడి పంటలతో కళకళాలాడే ఈ జిల్లా.. ఏపీ రాజకీయాలపై తనదైన ముద్ర వేసింది. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లా ఓటరు ఎటు మొగ్గితే.. ఆ పార్టీని విజయం వరిస్తుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనూ తూర్పు తీర్పు.. అనే నానుడి ప్రచారంలో ఉండేది. 2014, 2019 ఎన్నికల్లోనూ తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 12 చోట్ల విజయం సాధించగా.. బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఐదు సీట్లకే పరిమితమైంది. ఇక త్రిముఖ పోరు నెలకొన్న 2019 ఎన్నికల విషయానికి వస్తే.. 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. 4 చోట్ల టీడీపీ గెలిచింది. రాజోలులో జనసేన గెలుపొందింది.


మూడు లోక్ సభ స్థానాలు..


రాజమండ్రి, కాకినాడ, అమలాపురం లోక్ సభ స్థానాలు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా వైఎస్సార్సీపీ యువ నేత, గౌడ సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ నుంచి గూడూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత గెలుపొందారు. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీలో ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత పల్లం రాజు బరిలో ఉన్నారు.


అమలాపురం విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి చింతా అనురాధ ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి రాపాక వరప్రసాద రావు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈయన జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి దివంగత నేత బాలయోగి కుమారుడు గంటి హరీశ్ మాధుర్ పోటీ చేస్తున్నారు.


జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు..


రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, అనపర్తి, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ టౌన్, తుని, ప్రత్తిపాడు, కొత్తపేట, జగ్గంపేట, మండపేట, ముమ్మిడివరం, రంపచోడవరం, రాజోలు, రాజానగరం, పి.గన్నవరం, రామచంద్రాపురం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా.. కాకినాడ రూరల్, నిడదవోలు, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోనూ జనసేన బరిలో నిలిచింది. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్.. ఈసారి రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి గెలిచిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa