తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామంటోంది టీటీడీ. వేసవి కాలం కావడంతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఇవాళ జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వేసవి రద్దీ, ఇతర పండుగల దృష్ట్యా మే నెలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు ఈవో. వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలను రద్దు చేసినట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేసామమన్నారు.
తిరుమలలోని క్యూలు, కంపార్ట్మెంట్లలో నిరంతరం ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయ మాడవీధుల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా షెడ్స్, కూలెంట్లు, కార్పెట్లతో పాటు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నట్లు తెలిపారు. నారాయణగిరి గార్డెన్స్, ఆలయ పరిసరాల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఆలయ మాడవీధుల్లో చలువ పందిళ్లు కూల్ పాయింట్లు వేసినట్లు ఈవో తెలిపారు.
జూన్ 1 నుంచి 5 వరకు ఆకాశ గంగ దగ్గర ఉన్న బాలాంజనేయ స్వామి ఆలయం.. బేడి ఆంజనేయ స్వామి ఆలయం, ఏడో మైలు దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయ ఆలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అలాగే జూన్ 2న ధర్మగిరిలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం, నాద నీరాజనం వేదికలో ప్రత్యేక ప్రసంగాలు ఉన్నాయన్నారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో.. టీటీడీ విద్యాసంస్థలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న BIRRD, చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహణపై ప్రశంసలు కురిపించినట్లు ఈవో తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా టీటీడీ.. పేద, నిరుపేదలకు అధునాతన వైద్య సేవలను ఉచితంగా అందజేయడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు బెంగళూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న అమ్మాయి గోవింద కోటి రాసినందుకు శ్రీ వేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
మే 17 నుంచి 19 వరకు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి కార్యక్రమం ఉంటుంది. మే 21 నుంచి 23 వరకు తిరుచానూరులో వార్షిక వసంతోత్సవాలు.. మే 22న స్వర్ణ రథం ఊరేగింపు నిర్వహిస్తారు.మే 23న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పత్ర పుష్ప యాగం.. మే 27-29 వరకు శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు.. మే 28న స్వర్ణరథం ఊరేగింపు ఉంది. మే 23న తాళ్లపాక, తిరుపతిలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయోజనాల కోసం టీటీడీ పనిచేస్తోందని.. అందుకే కొండపై స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చ భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందన్నారు ఈవో. టీటీడీ కార్యవర్గం మొత్తం యాత్రికుల సేవకే అంకితమైందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa