ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వేళ కీలక పరిణామం.. సూపర్ సీఎం భార్య, ఐఏఎస్ బదిలీ వేటు

national |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 11:10 PM

లోక్‌సభ ఎన్నికలతోపాటే ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీ గత 2 దశాబ్దాలకు పైగా తిరుగులేని విజయాలు సాధిస్తూ అధికార పీఠంపై పాతుకుపోయింది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు మద్దతుగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఓ ఐఏఎస్ అధికారిణిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆమెనే సుజాత ఆర్.కార్తికేయన్. మిషన్ శక్తి విభాగంలో కమిషనర్ కమ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సుజాత ఆర్.కార్తికేయన్‌పై బదిలీ వేటు వేస్తూ ఈసీ అధికారులు ఉత్తర్వాలు ఇచ్చారు.


ఒడిశా ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారిణి సుజాత ఆర్‌.కార్తికేయన్‌.. ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఎన్నికల సంఘం అధికారులు గంటల వ్యవధిలోనే చర్యలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం మిషన్ శక్తి డిపార్ట్‌మెంట్‌లో కమిషనర్, సెక్రటరీగా పనిచేస్తుండగా.. తాజా నిర్ణయంతో ప్రజా వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే సుజాత ఆర్.కార్తికేయన్.. ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ అధినేత నవీన్‌ పట్నాయక్ సన్నిహితుడైన వీకే పాండియన్ భార్య కావడంతో ఆమె ట్రాన్స్‌ఫర్ ఒడిశాలో ప్రాధాన్యం సంతరించుకుంది.


సుజాత ఆర్.కార్తికేయన్ ఒడిశాలో బీజేడీ పార్టీకి ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక సుజాత ఆర్.కార్తికేయన్ భర్త.. వీకే పాండియన్ కూడా గతంలో ఐఏఎస్‌ అధికారిగా పని చేయడం గమనార్హం. ఐఏఎస్ అధికారిగా ఉన్న వీకే పాండియన్.. గతేడాది పదవికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి.. ఆ వెంటనే బీజేడీలో చేరారు. గతంలో 2019 ఎన్నికల ముందు నుంచి సీఎం నవీన్ పట్నాయక్‌కు వీకే పాండియన్‌ నమ్మకమైన అధికారిగా ఉన్నారని ఒడిశా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఉంటూనే తెర వెనక బిజు జనతా దళ్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిగా బీజేడీ నేతగా మారిపోయిన వీకే పాండియన్.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సీఎం నవీన్‌ పట్నాయక్ తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే వీకే పాండియన్‌ను.. ప్రతిపక్షాలు, విమర్శకులు సూపర్ సీఎం అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక ఒడిశాలో ఏడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న 146 స్థానాలకు మే 13 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4 వ తేదీన వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa