ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 10:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 98.47 మంది పింఛన్ లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. 48,92,503 మందిలో 48,17,718 మంది డబ్బులు ఖాతాల్లో జమ చేశారన్నారు. బ్యాంకు అకౌంట్‌లు పనిచేయని కారణంగా కొందరికి పింఛను డబ్బులు జమకాలేదు. వారందరికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74,399 మంది పింఛనుదారుల బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ కాలేదని లెక్క తేల్చారు. సచివాలయ ఉద్యోగులు వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీరి జాబితాను శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామనిన్నారు శశిభూషణ్‌కుమార్‌. మొత్తంగా చూస్తే.. 65.49 లక్షల మందికి గాను 63.31 లక్షల (96.67 శాతం) మంది లబ్ధిదారులకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 15,13,752 మందికి ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేశారు అధికారులు. ప్రధానంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు.


పింఛన్ల విషయంలో కొంత గందరగోళం కనిపించింది. బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తామని చెప్పినా.. చాలా మందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందారు. బ్యాంకులకు వెళితే అక్కడ భారీగా క్యూ లైన్లు కనిపించాయి. కొందరు లబ్ధిదారులకు 2, 3 అకౌంట్లు ఉండటంతో.. ఏ అకౌంట్‌లో జమం చేశారో తెలియలేదు.. బ్యాంకులో కూడా చెక్ చేసుకోలేని పరిస్థితి. కష్టమో నష్టమోనని కొందరు లబ్ధిదారులు క్యూ లైన్లలో గంటలకొద్ది నిలబడి అకౌంట్ చెక్ చేయిస్తే.. డబ్బులు జమ కాలేదని తెలిసి నిరాశతో వెనక్కు వెళ్లిపోయారు.


పింఛన్లు అకౌంట్‌కు జమ చేశారని చెప్పడంతో అందరూ బ్యాంకులకు క్యూ కట్టారు.. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లు కనిపించాయి. ఓ వైపు ఎండలు, వేడిగాలులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. ఇలాంటి సమయంలో బ్యాంకుకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. కొన్ని చోట్ల పలువురు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లు రన్నింగ్‌లో లేవని సిబ్బంది గుర్తించారు. ఆ అకౌంట్‌లను తిరిగి రన్నింగ్‌లోకి తీసుకురావాలంటే.. రూ.100, రెండు ఫొటోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకురావాలని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. అవి తీసుకొచ్చి ఇస్తే రెండు రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు.. దీంతో చాలామంది నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తం మీద పింఛన్ల పంపిణీ వ్యవహారం ఈ నెల కూడా తలనొప్పిగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa