ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 10:47 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బీసీవైపీ (భారత చైతన్య యువజన పార్టీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌కు ఊరట దక్కింది. ఆయనపై నమోదు చేసిన హత్యాయత్నం కేసులో బలవంతపు చర్యలొద్దని హైకోర్టు చిత్తూరు జిల్లా సదుం పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఎన్నికల ప్రచారానికి ఆటంకం కల్పించొద్దని.. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని రామచంద్రయాదవ్‌పై పోలీసులు నమోదు చేసిన మరో కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. కచ్చితంగా సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు నిబంధనలను పాటించాలని ఆదేశించింది.


బోడే రామచంద్రయాదవ్‌ తనపై సదుం పోలీసులు నమోదు చేసిన కేసుల్ని హైకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ కక్షతో పిటిషనర్‌పై తప్పుడు కేసులు నమోదు చేశారని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 8కి హైకోర్టు వాయిదా వేసింది.


రామచంద్ర యాదవ్ గతనెల 29న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరు సందుం మండలం ఎర్రాతివారిపల్లెలో ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ వాహనాలు ధ్వంసం చేయగా.. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనలో సదుం పోలీసులు రామచంద్ర యాదవ్‌తోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఊరట దక్కింది.. కోర్టు ఉత్తర్వుల తర్వాత రాచమంద్ర యాదవ్ పుంగనూరు తిరిగి వచ్చారు.


పుంగనూరు వెళ్లిన రామచంద్రయాదవ్‌ను అరెస్ట్ చేసేందుకు.. ఆయన ఇంటి దగ్గరకు పోలీసులు వెళ్లారు. అయితే హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన కాపీలను సీఐకు ఇవ్వగా.. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎర్రాతివారిపల్లెకు అనుమతి లేకుండా వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని.. అలాగే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఎంపీడీవో జి.రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు సదుం పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. రామచంద్రయాదవ్‌పై సెక్షన్‌ 341, 188 ఐసీపీ ప్రకారం మరో కేసు ఫైల్ చేసినట్లు చెప్పారు. వెంటనే హైకోర్టు లాయర్‌ను సంప్రదిస్తే.. అవి బెయిలబుల్ కేసులు కావడంతో 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులని గుర్తు చేశారు. ఈ కేసులో అరెస్టుకు అవకాశం లేదని చెప్పడంతో రామచంద్రయాదవ్ ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


తాను పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నానన్నారు రాచమంద్రయాదవ్. అందుకే తనకు ఆయ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. సదుంలో జరిగిన గొడవల్లో తనను హతమార్చేందుకు చూశారని.. ఏకంంగా పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించారన్నారు. తన వాహనాలను ధ్వంసం చేశారని.. ఇంత జరిగినా తిరిగి తనపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తం మీద పుంగనూరులో ఎన్నికల వేడి కనిపిస్తోంది.. ముందస్తు జాగ్రత్తగా అవసరమైన చోట్ల భారీగా బలగాలను మోహరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa