ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. సెల్‌ఫోన్ టార్చ్‌‌ వెలుగులో గర్బిణికీ సర్జరీ.. తల్లీబిడ్డ మృతి

national |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 11:26 PM

కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్ చేయకుండానే సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో గర్భిణికి సిజేరియన్ చేయగా... తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని, భారత్‌లో అత్యంత ధనిక పురపాలక సంస్థ బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. రూ. 52,000 కోట్ల బీఎంసీ బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం టాయించిన మొత్తం 12 శాతం అంటే రూ. 6,250 కోట్లు. అలాంటిది ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ సౌకర్యం లేకపోవడంతో శోచనీయం.


వివరాల్లోకి వెళ్తే. ఖుస్రుద్దీన్ అన్సారీ అనే దివ్యాంగుడి భార్య షాహిదున్‌కి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోమ్‌కు తీసుకొచ్చారు. ఉదయం 7 గంటలకు తీసుకురాగా.. రాత్రి 8 గంటల వరకూ సాధారణ కాన్పు అవుతుందని వైద్యులు నమ్మబలికారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత సిజేరియన్ చేయాలని తమ దగ్గర సంతకాలు తీసుకున్నారని, అప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయలేదని ఆరోపించారు. మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేసి, తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో బీఎంసీ దిగివచ్చి.. విచారణకు ఆదేశించింది.


అన్సారీ తల్లి మాట్లాడుతూ.. ‘నెలలు నిండిన మా కోడలు చాలా ఆరోగ్యవంతురాలు.. ఆమె వైద్య నివేదికల్లో ఎటువంటి సమస్యలు లేవు.. ఏప్రిల్ 29న ఉదయం పురిటి నొప్పులు రావడంతో 7 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చాం.. ఆ రోజంతా అలాగే ఉంచారు. రాత్రి 8 గంటల వరకూ అంతా బాగానే ఉంది.. సాధారణ ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు.. తీరా నేను లోపలికి వెళ్లి చూసేసరికి ఆమె రక్తంతో తడిసిపోయి ఉంది.. కోతవేసి ఫిట్‌గా ఉందని, సి-సెక్షన్ అవసరమని సంతకం కోసం వచ్చారు. అప్పుడే కరెంటు పోయింది.. ఆ తర్వాత కూడా మమ్మల్ని వేరే హాస్పిటల్‌కి పంపలేదు. మమ్మల్ని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారు. బిడ్డ చనిపోయిందని మేము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగా ఉంటుందని డాక్టర్ చెప్పారు. తర్వాత సియోన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు, కానీ అప్పటికే ఆమె చనిపోయింది. ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదు’ అని కనీటిపర్యంతమైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లీబిడ్డల ప్రాణాలు పోవడానికి బాద్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని అన్సారీ కోరాడు. ఎంతో కోల్పోయాను.. నాకు న్యాయం చేయాలని, ఇంతటి క్షోభకు గురిచేసినవారిని శిక్షించాల్సిందేనని, ఆసుపత్రిని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఖుస్రుద్దీన్ అన్సారీ, షాహిదున్‌తో 11 నెలల కిందటే వివాహం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa