కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు పెరుగుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను గెలిపించాలని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా జనసేనానికి మద్దతు ప్రకటించారు. మరికొంత మంది ఏకంగా పిఠాపురం వెళ్లి మరీ పవర్ స్టార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ నుంచి పవన్ కళ్యాణ్కు సపోర్ట్ లభించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించారు టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి హ్యాష్ ట్యాగ్ పిఠాపురం అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి హనుమ విహారి ట్వీట్ చేశారు. అలాగే ఇన్స్టా్గ్రామ్లో కూడా పవన్ కళ్యాణ్కు మద్దతుగా శుక్రవారం వీడియో పోస్ట్ చేశారు. అయితే గతంలో ఓ వివాదం సమయంలో హనుమ విహారికి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. జనసేన పార్టీ, తెలుగుదేశం కూడా హనుమ విహారికి మద్దతుగా నిలిచింది. దీంతో ఎన్నికల సమయంలో జనసేనకు మద్దతుగా హనుమ విహారి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ఆంధ్ర రంజీ జట్టుకు హనుమ విహారి కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే హఠాత్తుగా కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఓ రిజర్వ్ ఆటగాడి మీద ఆగ్రహం వ్యక్తం చేయటంతోనే విహారిని కెప్టెన్ పదవి నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. ఆ రిజర్వ్ ప్లేయర్ తండ్రి వైసీపీ నాయకుడని.. అందుకే విహారి మీద వేటు వేశారని వార్తలు, విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం హనుమ విహారికి అప్పట్లో మద్దతుగా నిలిచారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు ఇండియన్ క్రికెటర్ కంటే వైసీపీ లీడరే ఎక్కువయ్యారంటూ ఆరోపించారు. ఆంధ్ర జట్టు కోసం హనుమ విహారి ఎంతో కష్టపడ్డారన్న పవన్ కళ్యాణ్.. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్ అసోసియేషన్తో విహారి వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరఫున ఆడతాడని అప్పట్లో చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా విహారి ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa