ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 07:43 PM

తెలుగుదేశం పార్టీ నేతలు.. ప్రస్తుతం ఆ పార్టీ తరుఫున శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావులకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ , ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేశాయి. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేశాయి. తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూములను, ప్లాంట్ ఆస్తులను విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన NCLT నోటీసులు జారీ చేసింది. జూన్ 13వ తేదీలోపు ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగలిగినవారు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. వేలానికి పిలిచిన వాటిలో రఘురామకృష్ణరాజు డైరెక్టర్‌గా ఉన్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంటుకు చెందిన 311 ఎకరాల భూములు, కర్ణాటక హాంకాన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.


అలాగే గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్‌ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్‌ఫ్రా ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు రుణం తీసుకుంది. అయితే సకాలంలో రుణాలు చెల్లించకపోవటంతో ఈ కంపెనీ ఆస్తులు వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీచేసింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగినవారు బిడ్లు దాఖలు చేసేందుకు జూన్ ఏడో తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది.


ప్రస్తుతం రఘరామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున బరిలో ఉన్నారు. అలాగే గంటా శ్రీనివాసరావు.. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే రుణాల చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీచేసినప్పటికీ.. చెల్లించకపోవటంతో ఆస్తుల వేలానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa