ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 తర్వాత నరేంద్ర మోదీ స్థానంలో ప్రధానిగా అమిత్ షా?

national |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 10:21 PM

నరేంద్ర మోదీ. వరుసగా రెండుసార్లు బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన నేత. విజయవంతంగా ప్రధానమంత్రిగా 10 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఇక తాజాగా మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉండే ఛాన్స్ ఉంది. అయితే బీజేపీలో ఎప్పటినుంచో ఒక సిద్ధాంతం ఉంది. 75 ఏళ్లు దాటిన ఏ నాయకుడు కూడా బీజేపీలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే.


అయితే నరేంద్ర మోదీకి వచ్చే ఏడాదితో 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సంప్రదాయం ప్రకారం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పదవిని నరేంద్ర మోదీ వదులుకుంటే ఆ స్థానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీలో నంబర్ 2గా ఉన్న అమిత్ షా తదుపరి ప్రధానమంత్రి అవుతారనే ఊహాగానాలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు.


బీజేపీ తన సంప్రదాయానికి కట్టుబడి ఉండి.. నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుంచి తప్పిస్తుందా లేదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని కూడా అడిగారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అని బీజేపీ నేతలు అడుగుతున్నారని.. కానీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీకి 75 ఏళ్లు దాటిన తర్వాత ప్రధాని ఎవరు అని ప్రశ్నించారు.


2025 సెప్టెంబర్ 17 వ తేదీతో నరేంద్ర మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయని పేర్కొన్న కేజ్రీవాల్.. ఒకవేళ తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే ఆ తర్వాత పీఎం ఎవరని ప్రశ్నించారు. బీజేపీ గత చరిత్ర చూస్తే.. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా లాంటి బీజేపీ అగ్రనేతలు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు.


ఈ క్రమంలోనే మరోసారి బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే.. మొదటి రెండు నెలల్లోనే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌కు రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారని తెలిపారు. ఇప్పుడు అమిత్ షా పేరు చెప్పి నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారా అని అడిగారు.. అయితే మోదీ గ్యారెంటీలను అమిత్ షా నెరవేరుస్తారా అని ప్రశ్నించారు.


అయితే కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉంటారని తెలిపారు. అంతేకాకుండా ప్రధానిగా 5 ఏళ్ల పాటు మోదీనే ఉంటారని స్పష్టం చేశారు. తాము ఎవరం నరేంద్ర మోదీని భర్తీ చేయలేమని తెలిపారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ మూడోసారి గెలిస్తే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మార్చేస్తారని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అమిత్ షా ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa