ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖాలు నల్లగా ఉన్నాయని గెంటేసిన స్కూల్.. విద్యార్థులకు రూ.16.4 కోట్ల పరిహారం

international |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 11:58 PM

ముఖాలకు నల్లటి మాస్క్ వేసుకుని ఫోటోలు తీసుకున్నారనే ఆరోపణలతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను బహిష్కరించి.. యాజమాన్యం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మొటిమలకు చికిత్స తీసుకుంటున్న తమ స్నేహితుడికి మద్దతుగా విద్యార్థులు కూడా తమ ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకున్నారు. ఇదే విషయం విచారణలో రుజువు కావడంతో ఒక్కొక్కరికి మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.2 కోట్లు) చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌పై ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దావా వేశారు. 2017లో మొటిమలకు చికిత్స కోసం టీనేజర్లు మాస్క్ ధరించినట్టు పేర్కొంది.


తీవ్రమైన మొటిమలతో బాధపడుతోన్న తన స్నేహితుడికి సంఘీభావంగా ఇద్దరు విద్యార్థులు ముఖానికి మాస్క్ వేసుకుని.. ముగ్గురూ సెల్ఫీ తీసుకున్నారు. లేత ఆకుపచ్చ రంగులో ఉండే పొడి.. ముఖానికి వేసుకున్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడంతో ముఖాలు నల్లగా తయారయ్యాయి. తాము సరదాగా ఫోటో తీసుకున్నామని, ఇదేమీ జాత్యహంకార చర్య కాదని పేర్కొంటూ సోషల్ మీడియాలో వారు పెట్టిన ఆ సెల్ఫీ 2020లో వైరల్ అయ్యింది. దీనిని తీవ్రంగా పరిగణించిన స్కూల్ యాజమాన్యం.. ఆ విద్యార్థులను బలవంతంగా బయటకు పంపింది.


అయితే, తమ నుంచి ఎటువంటి వివరణ కోరకుండా బహిష్కరించారని ఆరోపిస్తూ విద్యార్థులు దావా వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం శాంటా క్లారా కౌంట్ జ్యూరీ సోమవారం తీర్పు వెల్లడించినట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ తీర్పు తమ క్లయింట్‌‌లకే కాదు.. విద్యార్థులను శిక్షించే విషయంలో సరైన విధానం పాటించని కాలిఫోర్నియాలోని అన్ని ప్రయివేట్ పాఠశాలలకు వర్తిస్తుందని బాధితుల తరఫున వాదనలు వినిపించిన లాయర్ క్రిస్టీ బౌఘమ్ అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ తీరు సక్రమంగా లేదని జ్యూరీ నిర్దారించిందని ఆయన అన్నారు.


ఓ విద్యార్ధి కుటుంబం మాట్లాడుతూ.. ‘మా పిల్లలు, మా కుటుంబాలకు న్యాయం చేసినందుకు జ్యూరీ, న్యాయ వ్యవస్థకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం.. కోర్టు తీర్పుతో వారు ఏ తప్పూ చేయలేదని తేలింది’ అన్నారు. వాస్తవానికి విద్యార్థులు 20 మిలియన్ డాలర్ల పరిహారం డిమాండ్ చేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. మరోవైపు, కోర్టు తీర్పుతో విబేధిస్తున్నామని, దీనిపై అప్పీలు చేస్తామని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు, దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని పేర్కొన్నారు. జ్యూరీ తీర్పు ఏకపక్షంగా ఉందని, పై కోర్టులో దీనిని సవాల్ చేస్తామని వారు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa