ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక మాజీ సీఎం ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స

national |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 07:48 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఎస్ఎం కృష్ణ ఆరోగ్యం విషమించింది. 92 ఏళ్ల ఎస్ఎం కృష్ణ ఏప్రిల్ 29న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసబ్యులు మర్నాడు ఏప్రిల్ 30న బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేర్పించారు. తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్టు వైద్యులు నిర్దారించారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతుండగా... శనివారం ఆయన పరిస్థితి విషమించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రిని వైద్యులు ఐసీయూకి తరలించారు. ఎస్ఎం కృష్ణ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న వైద్యులు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మాజీ సీఎం కోలుకుంటున్నారని పేర్కొన్నారు.


ణిపాల్ హాస్పిటల్ పల్మనాలజీ విభాగం చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యన్నారాయణ మైసూర్‌తోపాటు క్రిటికెట్ కేర్ విభాగం చీఫ్ డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. మాజీ సీఎం కృష్ణ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆకాంక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా ఎస్ఎం కృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. అక్టోబరు 11, 1999 నుంచి మే 28, 2004 వరకూ కర్ణాటక సీఎంగా ఉన్న ఆయన.. బెంగళూరును దేశ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఐటీ రాజధానిగా బెంగళూరు గుర్తింపు పొందడానికి ఈయనే కారణం.


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ-2 హయాంలో 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు 2004 నుంచి 2008 వరకూ మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. అయితే, 2017లో కాంగ్రెస్‌తో తనకు దాదాపు 50 ఏళ్ల అనుబంధాన్ని ముగింపు పలికి బీజేపీలో చేరారు. గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa