ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తెనాలి, నరసరావుపేటలో జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్పై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయన్ను పోలింగ్ పూర్తయ్యే వరకూ గృహ నిర్బంధంలో ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గోపిరెడ్డీ శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆయన్ను పోలింగ్ పూర్తయ్యేవరకు శ్రీనివాస్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచాలని ఆదేశించింది.
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి శివకుమార్ వెళ్లారు.. అయితే ఆయన క్యూ లైన్లో కాకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండగా.. ఓ ఓటరు అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్యే శివకుమార్ సహనం కోల్పోయి ఆ ఓటరు చెంపను చెల్లుమనిపించారు. ఆ వెంటనే ప్రతిఘటించి.. తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. ఆ వెంటనే శివకుమార్ అనుచరులు ఓటరుపై దాడికి చేశారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు. తెనాలి ఐతానగర్లో తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు. 'ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావా' అంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు ఆరోపించారు. వైఎస్సార్సీపీపై ద్వేషంతో రగిలిపోయారని.. తన భార్యమ ముందే తనను అసభ్యంగా దూషించారన్నారు. బూత్లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేప్పుడు సుధాకర్ దుర్భాషలాడుతూనే ఉన్నట్లు చెప్పారు. గొట్టిముక్కల సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వ్యక్తి అన్నారు.
'నువ్వు అసలు కమ్మోడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడు.. పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించాడు. పోలింగ్ బూత్లో ఉదయం నుండి అతడు హల్చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారు. అతడు బెంగళూరులో ఉంటూ ఇక్కడకు వచ్చి హడావిడి చేశాడు. టీడీపీ, జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను పిలిపించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు' అని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. మాచర్లతో పాటుగా నరసరావుపేటలో ఘర్షణలు జరిగాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa