2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రికార్డులు బద్ధలుకొట్టాయి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో.. పోలింగ్ బూత్లన్నీ జనజాతరను తలపించాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. వృద్ధులు, యువత అనే భేదం లేకుండా .. ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో కొన్ని పోలింగ్ కేంద్రాలలో అర్ధరాత్రి రెండు గంటల వరకూ ఓటింగ్ జరిగిందంటేనే ఓటరు చైతన్యం ఎంతలా వెల్లివిరసిందనేదీ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రేంజులో పోలింగ్ జరగడానికి కారణాలు ఏంటనే దానిపై.. రాజకీయ విశ్లేషకులు, పార్టీలు విశ్లేషించే పనిలో పడ్డాయి.
2019 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సుమారుగా రెండు శాతం అధికంగా ఓటింగ్ నమోదైంది. 2019లో 79.74 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఈసారి 81.86 శాతానికి చేరింది. 2019 ఎన్నికల్లో అధికార టీడీపీ ఓటమి పాలైంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2024లో ఇంతలా పోలింగ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటు హక్కు మీద ప్రజల్లో పెరిగిన అవగాహన కూడా పోలింగ్ పెరగడానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల్లో భాగస్వామ్యంపై ఎన్నికల సంఘం, స్వచ్ఛందసంస్థలు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు కూడా ఒకందుకు కారణమనే భావన కూడా ఉంది. అలాగే ఈ ఎన్నికలను అటు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఫలితాలు తారుమారైతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితుల్లో .. ఆయా పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు ఓటేయ్యడానికి పెద్దసంఖ్యలో తరలివచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో జరిగిన గత మూడు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. 2014లో రాష్ట్రవిభజన అంశం ప్రధానంగా నిలిచింది. 2019 ఎన్నికల్లో నూతన రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు కీలకంగా మారాయి. ఈ రెండు అంశాల గురించి ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. ప్రభుత్వ వ్యతిరేకతగా మారి 79 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో టీడీపీని ఓడించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 ఏపీ ఎన్నికల సమయానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు, అభివృద్ధి, ఇసుక, లిక్కర్ మాఫియా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన అంశాలుగా మారాయి. ఐదేళ్ల కాలంలో తాము అమలుచేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో వైసీపీ ప్రచారం చేయగా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, లిక్కర్ మాఫియా, అభివృద్ధి జరగలేదనే అంశాలతో టీడీపీ కూటమి ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో భారీగా నమోదైన పోలింగ్ శాతం గురించి రాజకీయ పార్టీలన్నీ తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. పోలింగ్ శాతం పెరగటం అంటే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడమేనని టీడీపీ కూటమి చెప్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత స్పష్టంగా తెలిసిందని.. ఎన్డీయే కూటమిదే అధికారమని టీడీపీ నేతలు ధీమాగా చెప్తున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు నచ్చి.. ప్రజలు పెద్దసంఖ్యలో ఓట్లు వేసినట్లు వైసీపీ చెప్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటేశారని.. ఇదంతా పాజిటివ్ ఓటింగేనని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మరి వాస్తవం ఏమిటనేదీ జూన్ నాలుగో తేదీ వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa