ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సినీ సెలబ్రిటీల నుంచి పొలిటికల్ లీడర్ల వరకూ.. అందరి జ్యోతిష్యాలు చెప్తూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ట్రెండింగ్ అంశాలు, ట్రెండింగ్లో ఉన్న సెలబ్రిటీల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడీయన ప్రస్తావన ఎందుకంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వేణుస్వామి ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరూ కార్లో వెళ్తూ ఏదో పిచ్చాపాటీగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వేణుస్వామి ఇప్పటికే తేల్చేశారు. అనేక ఇంటర్వ్యూలలో ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై వేణుస్వామి తన అంచనాను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించడం ఖాయమని.. పలు ఇంటర్వ్యూలలో గత రెండేళ్లుగా చెప్తూ వస్తున్నారు వేణుస్వామి. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం పక్కానని జనసైనికులు చెప్తుంటే.. పవర్ స్టార్కు రాజకీయ యోగం లేదనేది వేణుస్వామి జ్యోతిష్యం అంచనా. అలాగే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు గట్టిపోటీ ఎదుర్కొంటారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి చెప్పుకొచ్చారు.
అలాగే వైఎస్ జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమని.. అయితే ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉన్న సమయంలోనే వేణుస్వామి.. వైఎస్ జగన్తో కలిసి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సమయంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది టీడీపీ, జనసేన మద్దతుదారులు.. వేణుస్వామి కూడా వైసీపీ మనిషేనంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో నాలుగేళ్ల కిందటిదిగా తెలుస్తోంది. 2019లో ఇద్దరూ కలిసి కార్లో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa