అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన సతీమణి విజయమ్మ, సోదరిని ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరించారు. బలవంతంగా వారిని హైదరాబాద్కు తరలించారు. అంతకంటే ముందుగానే వారి ఇళ్లలో పనిమనుషులను అదుపులోకి తీసుకున్నారు. దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్న దివాకర్ రెడ్డి, సతీమణి, సోదరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న జేసీ తనయుడు పవన్రెడ్డి హైదరాబాద్ నుంచి గురువారం తాడిపత్రికి చేరుకున్నారు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు ఆయనను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా లేదని వారిని చూడటానికి వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. చాలాసేపు వాదోపవాదాలు జరిగాక పవన్రెడ్డిని ఇంటిలోకి అనుమతించారు. మధ్యాహ్నం హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పవన్రెడ్డికి నోటీసులు అందించారు. ఆ తరువాత గంటల వ్యవధిలోనే ఊరువిడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీచేశారు. శాంతిభద్రతల దృష్ట్యా తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ ఉండకూడదని ఆదేశాలు ఉన్నాయని, వెంటనే హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, తన సోదరి కోమాలో ఉన్నారని దివాకర్రెడ్డి చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక జేసీ దివాకర్రెడ్డి, ఆయన సతీమణి, సోదరి, కుమారుడు జేసీ పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి సతీమణి ఉమారెడ్డి పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్కు తరలివెళ్లారు. జేసీ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పవన్రెడ్డి మీడియా తో మాట్లాడాలని భావించినా అనుమతించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa