దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనుందనే దానిపైనే సర్వత్ర ఆసక్తి రేపుతోంది. మరోవైపు పోలింగ్ తేదీ రోజు.. అనంతరం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అలజడి చెలరేగింది. దీంతో ఆయా జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇక ఓట్ల లెక్కింపు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా హింస చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే కేంద్ర సాయుధ బలగాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందని పోలీసులను సైతం రాష్ట్రానికి రప్పించారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సీఎం వైయస్ జగన్ నివాసాలతోపాటు వారి పార్టీ కార్యాలయాల వద్ద భారీగా భద్రతను పెంచారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకమైన షటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ విధించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఆ యా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలు అటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తడ వద్ద, ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద భద్రతతోపాటు నిఘాను మరింత పటిష్ట పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa