ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పటి వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావొద్దు.. టీడీపీ కూటమి అభ్యర్థులకు చంద్రబాబు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 05:27 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బీజేపీ నే అరుణ్‌సింగ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సహా ఎన్డీయే నేతలు, అభ్యర్థులతో ఆదివారం ఆయన జూమ్‌ కాల్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఏజెంట్లకు నేతలు వివరించారు


కౌంటింగ్ రోజు పూర్తిస్థాయి ఫలితాలొచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాలని.. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు కేంద్రంలోనే ఉండాని సూచించారు. ఆర్వో నుంచి డిక్లరేషన్‌ ఫాం తీసుకున్నాకే బయటకు రావాలని చంద్రబాబు కూటమి అభ్యర్థులకు సూచించారు. ఒకవేళ ఎక్కడైనా కౌంటింగ్‌ ప్రక్రియపై అనుమానాలుంటే రీ కౌంటింగ్‌ కోరాలని.. కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. అభ్యర్థులు, నేతలు, ఏజెంట్లు కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.


కౌంటింగ్ రోజు ముందుగానే అభ్యర్థులు, ఏజెంట్లు కేంద్రం వద్దకు చేరుకోవాలని.. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే సమయంలో సీల్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారులు నిబంధనలు పాటించేలా చూడాలని.. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాల ఏర్పాటు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్ ఎన్డీయే కూటమి గెలుస్తుందని తేల్చాయని.. కూటమి గెలుపు కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని.. ఓట్ల బదిలీ జరిగిందని ప్రశంసించారు.


చంద్రబాబు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరు నేతలు చాలా కష్టపడి పనిచేశారన్నారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు, ఈసీపై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేస్తోందని.. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని వారు ఇప్పటికే మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. పోస్టల్‌ బ్యాలట్‌ డిక్లరేషన్‌పై ఎన్నికల సంఘం ఆదేశాలపై కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్నారు. కౌంటింగ్‌ రోజూ అక్రమాలు, దాడులు చేస్తారని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు గెలవనున్నారని.. 53% ఓటింగ్‌ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ నేత అరుణ్ సింగ్. వైఎస్సార్‌సీపీ ఘర్షణకు దిగే అవకాశం ఉందని.. న్యాయ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్‌ అందరికి సూచనలు చేశారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్‌ కోరాలని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్‌ కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉండాలని అభ్యర్థులు, ఏజెంట్లకు సూచించారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టినా.. అందరూ రాజ్యాంగ, చట్టబద్ధంగా వ్యవహరించాలని.. సంయమనం పాటించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa