7 దశలుగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠ మరికొన్ని గంటల్లో వీడనుంది. కేంద్రంలో మరోసారి గెలిచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా లేక.. ప్రతిపక్ష ఇండియా కూటమి గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ.. ఈసారి కూడా గెలిస్తే దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కుతారా. అసలు అతి ఎక్కువ కాలం భారత ప్రధానిగా పనిచేసిన వారు ఎవరు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ
దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. భారతదేశం నుంచి బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయిన తర్వాత ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. ఇక 1949 నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాతి నుంచి.. 1952 లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు జవహర్ లాల్ నెహ్రూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత స్వాతంత్య్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా గెలిచి తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే 16 ఏళ్ల 286 రోజుల పాటు ప్రధానమంత్రి హోదాలో దేశానికి సేవలు అందించారు.
ఇందిరా గాంధీ
జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ దేశానికి రెండో ప్రధాని అయ్యారు. నెహ్రూ తర్వాత ఇప్పటికీ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న వారి జాబితాలో ఇందిరా గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. ఇందిరా గాంధీ మొత్తం 15 ఏళ్ల 350 రోజుల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.
నరేంద్ర మోదీ
యూపీఏ హయాంలో వరుసగా రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ను దాటేసి.. ప్రధాని మోదీ ఇటీవలె మూడో స్థానంలో నిలిచారు. నరేంద్ర మోదీ 10 ఏళ్ల 8 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ చూస్తే మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ అవుతారని స్పష్టం అవుతోంది. అయితే ఈ 3 టర్మ్ మొత్తం 5 ఏళ్ల పాటు ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగినా.. ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలను దాటేయలేరు. ఎందుకంటే 2029 ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగినా 15 ఏళ్లు దాటుతుంది. అయితే 2029 ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం ఈ రికార్డులు చెరిగిపోనున్నాయి.
మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల 4 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. అటల్ బిహారీ వాజ్పేయీ 6 ఏళ్ల 80 రోజులు.. రాజీవ్ గాంధీ 5 ఏళ్ల 32 రోజులు.. పీవీ నరసింహా రావు 4 ఏళ్ల 330 రోజులు.. మొరార్జీ దేశాయ్ 2 ఏళ్ల 126 రోజుల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఏడాది 216 రోజులు.. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్) 343 రోజులు.. హెచ్డీ దేవెగౌడ 324 రోజులు, ఐకే గుజ్రాల్ 332 రోజులు, చంద్రశేఖర్ 223 రోజులు, చరణ్ సింగ్ 170 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa