ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సభాప్రాంగణం చప్పట్లు, కేకలతో మార్మోగిపోయింది.కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భార్య అన్నా లెజనోవా, మెగాస్టార్ చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆ తర్వాత అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా తన అన్న చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. మెగా బ్రదర్స్ను ఆత్మీయంగా పలకరించిన మోదీ.. వారిద్దరిని అభిమానంగా హత్తుకున్నారు. దీంతో సభా ప్రాంగణం మరోసారి మార్మోగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa