ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని టెక్సాస్లో ఓ సూపర్ మార్కెట్లో జరిగిన దోపిడీ ఘటనలో దొంగ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన యువకుణ్ని బాపట్ల జిల్లాకు చెందిన 32 ఏళ్ల దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. కుమారుడి మరణవార్త విని ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజిలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు పెళ్లై.. ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే మంచి భవిష్యత్తు కోసం, అవకాశాల కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేయాలని.. ఎనిమిది నెలల కిందట అమెరికాకు వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్లో సూపర్ మార్కెట్లో పనిచేస్తూనే చదువుకుంటున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం ఓ దుండుగుడు గోపీకృష్ణ పనిచేస్తున్న సూపర్ మార్కెట్లోకి చొరబడ్డాడు. వస్తూ వస్తూనే కౌంటర్లో ఉన్న గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గోపీకృష్ణ తీవ్రగాయాలై కిందపడిపోగా.. దుండుగుడు షాపులోని వస్తువులు దోచుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సూపర్ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
అనంతరం తీవ్ర గాయాలైన గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. గోపీకృష్ణ మృతితో యాజిలిలోని అతని కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అమెరికాకు వెళ్లి మంచి చదువులు చదివితే గొప్పగా స్థిరపడవచ్చని భావించాడని.. కానీ ఇలా తమను వదిలేసి వెళ్లిపోతాడని ఊహించలేదని ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోదిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa