నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై ఓ మహిళ చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలోని జనార్ధన్ రెడ్డి కాలనీలోని తమ భూమిలో అక్రమంగా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ధైర్యం చేసిన ముస్లిం మహిళ కౌసర్ జాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అనేకసార్లు అనిల్ కుమార్, వైసీపీ నేతల చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. యజ్దానీ అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశామని.. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కౌసర్ రాసుకొచ్చారు. ఈ నిర్మాణానికి కర్త, కర్మ.. క్రియ మొత్తం అనిల్ కుమారేనని, ఆయనే శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మహిళ మీడియాతో చెబుతున్నారు. తనకు న్యాయం చేయాలని ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నట్లు కౌసర్ తెలిపారు. ఇప్పుడు వైసీపీ పోయి.. కూటమి ప్రభుత్వం రావడంతో మరోసారి ఫిర్యాదు చేశారామె. పోలీసులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణం, చుట్టు పక్కల ఉన్న రెండున్నర ఎకరాలు భూమి ఆక్రమించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రెండ్రోజులుగా ఇంత రచ్చ జరుగుతున్నా అనిల్ కానీ.. వైసీపీ నేతలు ఒక్కరంటే ఒక్కరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమం కాదు సక్రమమే అయినప్పుడు అనిల్ ఎందుకు స్పందించట్లేదని సొంత కార్యకర్తల్లో సైతం సందేహాలు వస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తారో.. లేకుంటే మిన్నకుండిపోతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa