ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 07:31 PM

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లికి వందనం మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. అదంతా తప్పుడు ప్రచారంగా పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ.. ఈ పథకం విది విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాత విడుదల చేస్తామని తెలిపింది. అప్పటి వరకూ అవాస్తవాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని సూచించింది.


మరోవైపు ఏపీలో తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు రావాలంటూ అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో తల్లికి వందనం పేరుతో పిల్లలను బడులను పంపే తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున నగదు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలుకు మార్గదర్శకాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.


ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు అందిస్తారంటూ వార్తలు వచ్చాయి. అలాగే విద్యార్థులు ఆధార్ కార్డులు సిద్ధం చేసుకోవాలని, 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకానికి అర్హులని పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇక తల్లికి వందనం జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని రాశారంటూ విపక్షాలు కూడా దీనిపై విమర్శలు ప్రారంభించాయి. ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ప్రతి తల్లికి అని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు ప్రారంభించాయి.


ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పందించింది. పథకం అమలుపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేశాక.. మార్గదర్శకాలను విడుదల చేస్తామని.. అప్పటి వరకూ ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa