దర్శి నగర పంచాయతీలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దర్శి-అద్దంకి రోడ్డులో మార్జిన్లలో ఆక్రమణలను తొలగించారు. మురుగుకాల్వకు అడ్డుగా వేసిన దిమ్మెలను తీసేశారు. కాల్వలో పూడికలను తీస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందున మురుగు బయటకు వెళ్లకుండా అలాగే నిల్వ ఉంటున్న విషయం తెలిసిందే. కొద్దిపాటి వర్షం పడినా మురుగు రోడ్లపై చేరటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్జిన్ ఆక్రమణల తొలగింపు, కాల్వల అడ్డంకులను తొలగించే కార్యక్రమాలను చేపట్టారు. చేపట్టిన పనులను పూర్తిగా నిర్వహిస్తారా లేదా అనే సందేహం ప్రజల్లో ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొన్ని రోడ్లల్లో ఆక్రమణలను తొలగించారు. ఆ తర్వాత కొన్నిరోడ్ల గురించి పట్టించుకోలేదు. ఆక్రమణలను తొలగించిన రోడ్లల్లో కొంతకాలానికి మళ్లీ యథాతథంగా ఆక్రమణలు ముందుకొచ్చాయి. ఆ సమయంలో రోడ్డు మార్జిన్లలో చిరు వ్యాపారులను తాత్కాలికంగా తొలగించారు. వారి నుంచి ముడుపులు వసూళ్లు చేశారనే విమర్శలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రోడ్లమార్జిన్లు ఆక్రమణల పేరుతో బంకులు, తోపుడుబండ్లు తొలగిస్తున్నారు. ఆక్రమణలతో రోడ్లు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోని ఈసారైనా నిబద్దతతో ఆక్రమణలు తొలగిస్తారా గతంలో వలే తెరచాటు వ్యవహారాలను సాగించి చేతులు దులిపేసుకుంటారా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa