జులై నెలాఖరుకు వచ్చిన నేపథ్యంలో ఆగస్ట్ నెలలో పింఛన్ల పంపిణీకై టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్ట్ నెల ఒకటో తేదీనే 99 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. తొలి రోజే 99 శాతం మందికి పింఛన్ల పంపిణీ చేయాలన్న గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ.. సాంకేతిక సమస్య రెండో రోజు పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. మరోవైపు ఆగస్ట్ నెలలోనూగ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
మరోవైపు గత నెల మాదిరిగానే ఆగస్టులోనూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తారు. 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సామాజిక భద్రతా పించన్లను రూ.3000 నుంచి రూ.4000 లకు పెంచుతామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు జులై నెలలోనే పెంచిన పింఛన్లను అమలు చేశారు. ఏప్రిల్ నెల నుంచి బకాయి ఉన్న మూడు వేలు కూడా కలిపి.. లబ్ధిదారులకు రూ.7000 చొప్పున పింఛన్లు అందించారు. అయితే ఆగస్ట్ నెలలో లబ్ధిదారులకు రూ.4000 పింఛన్ అందనుంది.
మరోవైపు గతంలో వాలంటీర్ల ద్వారా ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసేవారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పూర్తిగా పక్కనబెట్టింది. సచివాలయ సిబ్బంది సాయంతో పింఛన్లను ఇంటివద్దకే పంపిణీ చేస్తున్నారు. జులై నెలలోనూ కేవలం ఒక్కరోజులోనే 95 శాతానికి పైగా పింఛన్లను ఒక్కరోజులోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గత నెల తరహాలోనూ ఆగస్ట్ నెల కూడా ఒకటో తేదీనే అందరు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏవైనా కారణాలతో పింఛన్లు అందుకోలేనివారికి రెండో తేదీ అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa