ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 1 వ తేదీ (గురువారం) న పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని తేల్చి చెప్పారు. పింఛన్ల పంపిణీ కోసం ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వెల్లడించారు. మరోవైపు.. ఆరోగ్య శ్రీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని.. దాని వల్లే ఇప్పుడు చాలా ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయని చెప్పారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు వైద్యం అందకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే కారణమని మంత్రి విమర్శలు గుప్పించారు. గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుపోయిందని మంత్రి పార్థసారథి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పార్థసారిథి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కోటిమందికి పథకం అమలు చేస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల కారణంగా.. రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసి.. చివరికి భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని మండిపడ్డారు. ప్రభుత్వంపై గోబెల్స్, అబద్దాలు ప్రచారం చేయడం మానేసి.. అసెంబ్లీకి వచ్చి.. వాళ్ల హయంలో చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వైసీపీ నేతలు చెప్పుకోవాలని మంత్రి పార్థసారథి హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa