ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కనెక్షన్ల మంజూరు విధానంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీఈపీడీసీఎల్ (తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై సచివాలయం, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కేవలం 1912 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే సరిపోతుందంటున్నారు అధికారులు. కాల్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది.
ఇలా రిజిస్ట్రేషన్ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో ఆయా రైతులకు కనెక్షన్లు ఇస్తారని అధికారులు చెబుతున్నారు. తొలిసారి ఈపీడీసీఎల్ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ నుంచి 11 జిల్లాల్లోని వెబ్ల్యాండ్ వివరాలను ఈపీడీసీఎల్ పోర్టల్కు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు కాల్ చేసి.. తన భూమి ఖాతా సంఖ్య, సర్వే నంబర్ చెప్పిన వెంటనే వెబ్ల్యాండ్లో ఆయా వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఈ కనెక్షన్ల కోసం 1912 కాల్ సెంటర్లో కొంతమంది సిబ్బంది ప్రత్యేకంగా విధుల్లో ఉన్నారు.
గత నెల రోజుల్లో కొత్త విధానంలోనే రైతులకు అవసరమైన వ్యవసాయ కనెక్షన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్ల కోసం మీసేవ కేంద్రాలు, సచివాలయల్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని పూర్తిగా ఆపేశఆరు. విద్యుత్ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటుగా వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రైతులు కాల్ చేసిన సమయంలో బిజీ వచ్చినా, తిరిగి వారికి ఫోన్ చేసి వివరాలు తీసుకుంటారని.. కనెక్షన్ల కోసం మధ్యవర్తులను ఆశ్రయించొద్దని సూచిస్తున్నారు. ఎవరికైనా కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే 1912 కాల్ సెంటర్ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. చాలా సులభంగా కనెక్షన్ వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చామంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa