రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. వర్షాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ఠంగా నమోదవుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటలకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.
ఆదివారం కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 60.25 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు, వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, ఒంగోలు, నెల్లూరు, కావలి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఎండ వేడి పెరిగిపోవడంతో విద్యుత్ వాడకం కూడా పెరుగుతోంది. ఉక్కపోతకు ఏసీలు వాడకపోతే ఉండలేని పరిస్థితి నెలకొంది. శనివారం ఏకంగా 228.941 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు చేరింది. కానీ, 190.197 ఎంయూ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండటంతో కోతలు తప్పడం లేదు.
పగలూ రాత్రి ఒకటే ఉక్కపోత ఊపిరి సలపనివ్వడం లేదు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్ కావడంతో వర్షాలు పడటానికి తేమ అవసరం. అయితే మేఘాలు మాత్రం ఏర్పడటం లేదు. దీంతో రెండు పరిస్థితుల మధ్య సమన్వయం కుదరక తేమ శాతం గాలిలో ఉండిపోయి, దీనివల్ల ఉక్కపోత పెరుగుతోందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa