మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర చర్చకు దారితీసే ఘటన ఒకటి చోటు చేసుకుంది. మరాఠా వీరుడు, ఛత్రపతి శివాజీకి చెందిన భారీ విగ్రహం నేలకూలడం తీవ్ర సంచలనంగా మారింది. గతేడాది చివర్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని.. జాతికి అంకితం ఇచ్చిన కొన్ని నెలల్లోనే కుప్పకూలిపోవడం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రారంభించిన ఈ విగ్రహం 9 నెలలకే నేలకొరగడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. మాల్వాన్లోని రాజ్కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే గతేడాది డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా పాల్గొన్నారు. అయితే ఏడాది కూడా పూర్తి కాకుండానే శివాజీ విగ్రహం కూలిపోవడం పట్ల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై పోలీసులు, ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రారంభించిన కొన్ని నెలలకే ఈ భారీ విగ్రహం కూలిపోవడం వెనుక ఏవైనా కుట్రలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విగ్రహం కూలిపోవడానికి కారణం కచ్చితంగా తెలియరానప్పటికీ.. నిపుణులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మాల్వాన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత 2, 3 రోజుల నుంచి భీకరమైన గాలులు కూడా వీస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ వానలు, గాలుల కారణంగానే ఆ విగ్రహం కూలిపోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సింధుదుర్గ్ జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్.. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. విగ్రహానికి సరైన నిర్వహణ చేయలేదని.. దాని పట్ల కొంచెం కూడా శ్రద్ధ వహించలేదని మండిపడ్డారు. కేవలం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించాలనే తాపత్రయంలో షిండే సర్కార్ మునిగిపోయిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు ఇచ్చి.. కమీషన్లు తీసుకుని కాంట్రాక్టులు ఇస్తోందని విమర్శించారు.
ఇక ఈ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కార్ స్పందించారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై తనకు పూర్తి సమాచారం లేదని.. అయితే దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని.. ప్రజా పనుల శాఖ మంత్రి, సింధుదుర్గ్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి రవీంద్ర చవాన్ తెలిపారని.. చెప్పారు. కూలిన ప్రాంతంలోనే కొత్త విగ్రహాన్ని పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa