తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై స్పష్టతనిస్తూ.. కీలక ప్రకట చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈవో.. ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈవో.. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు.. తగినన్ని రూ.50 లడ్డూ ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యమని తెలిపారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లు భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారి రెండు లడ్డూలు ఇవ్వనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
టీటీడీ ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తుందని.. ఇందులో రెండున్న లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని.. మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని ఈవో తెలియజేశారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి.. బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈవో చెప్పుకొచ్చారు.
టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందని ఈవో తెలిపారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు.
తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామని ఈవీ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా, భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకొని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు, తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సీవీఎస్ఓ, జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు ఈవో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి.. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa