తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయ్యాయి. కొత్త హంగులతో స్వామి పుష్కరిణిని సిద్ధం చేయగా.. ఆదివారం నుంచి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించారు. కాగా ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదీన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్వర్క్స్ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు.
అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు (పెయింటింగ్) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమత్తు పనులు పూర్తిచేశారు. అయితే గత నెల స్వామి పుష్కరిణి మరమత్తుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. సెప్టెంబర్ 1వ తేది నుంచి భక్తులను కూడా పుష్కరిణిలోనికి అనుమతించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలియజేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటుగా.. తగినన్ని రూ.50/- లడ్డూ ప్రసాదాలు అందిస్తామన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారి రెండు లడ్డూలు ఇస్తామన్నారు.
టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని.. ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయన్నారు ఈవో శ్యామలరావు. అయితే మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని.. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. వీటిని తీసుకెళ్లి బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోంది అన్నారు ఈవో శ్యామలరావు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అన్నారు. తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందని చెప్పారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కొంతమంది కార్పొరేషన్ సిబ్బంది వ్యవహార బయటపడిందని.. వారిలో కొందరు భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం టీటీడీ ఐటి వ్యవస్థ సహకారంతో అమలు చేస్తున్న విధానం ద్వారా.. గత మూడు రోజులుగా, భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకొని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు వంటి విషయాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీవిఎస్వో, జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు చెప్పారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి, శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఈవో శ్యామలరావు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa