ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు తప్పిపోయింది. గురువారం పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. అయితే ఈ అల్పపీనడం ఉత్తరదిశగా కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండురోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉందంటున్నారు. రోహ్తక్ (హర్యానా), మండ్ల (మధ్యప్రదేశ్), సూరత్గఢ్ (రాజస్థాన్) మీదుగా అల్పపీడన కేంద్రం వరకు.. అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది అంటున్నారు.
ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, నంద్యాల తదితర జిల్లాల్లో వానలు పడ్డాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది.
బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని రంగంలోకి దింపిన ప్రభుత్వం
మరోవైపు ఎగువున కురుస్తున్న వర్షాలకు.. గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.80 లక్షల క్యూసెక్కులు ఉంది. గోదావరి పరివాహక, లంకగ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరదనీటిలోకి ప్రవేశించవద్దు.. కాలువలు,కల్వర్టులకు దూరంగా ఉండాలి.. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని.. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa