ఎన్నికలు అనగానే ముందుగా అభ్యర్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. తమకు టికెట్ దక్కుతుందా లేదా అని చివరి నిమిషం వరకు ఉత్కంఠగా ఉంటారు. ఇక ధనం, కులం, నియోజకవర్గంలో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థికి హైకమాండ్ టికెట్ కేటాయిస్తుంది. చివరికి టికెట్ దక్కని అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి దూకడమో లేక ఇండిపెండెంట్గా పోటీ చేయడమో చేస్తారు. అయితే కుమారుడు బీజేపీ ఎంపీగా ఉన్నా.. తన తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోలేకపోయాడు. అది కూడా దేశంలోనే అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్కే బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
భారతదేశంలోనే సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్ హర్యానా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకు ఆమె బీజేపీ టికెట్పైనే హిస్సార్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి.. ఇటీవలే బీజేపీ 67 మందితో తొలి జాబితాను విడుదల చేయగా అందులో సావిత్రి జిందాల్కు చోటు ఇవ్వలేదు. ఇన్ని రోజులు హిస్సార్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన సావిత్రి జిందాల్కు నిరాశే ఎదురైంది. ఆ స్థానాన్ని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి కమల్గుప్తాకు కమలం పార్టీ కేటాయించింది. ఇంతకుముందు కమల్ గుప్తా వరుసగా.. 2 సార్లు హిస్సార్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది.
బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత జిందాల్ చౌక్కు సావిత్రి జిందాల్ చేరుకోగా.. ఆమెకు మద్దతుగా భారీ సంఖ్యలో జనం, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆమె స్వతంత్రంగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హిస్సార్ తన సొంత ఇల్లు అని.. నియోజకవర్గ ప్రజల సమస్యలు వినాల్సిన బాధ్యత తనపై ఉందని.. సావిత్రి జిందాల్ అన్నారు. తాను బీజేపీలో చేరలేదని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన కుమారుడు, కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఆధ్వర్యంలో కురుక్షేత్రలో జరుగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదులో తాను పాల్గొనలేదని సావిత్రి జిందాల్ తేల్చి చెప్పారు.
అయితే బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల తాను ఆగ్రహంగా లేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ఈ సందర్భంగా సావిత్రి జిందాల్ తేల్చి చెప్పారు. బీజేపీ హయాంలో హిస్సార్ నియోజకవర్గంలో చాలా పనులు చేసినా.. ఇంకొన్ని మిగిలే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఈసారి గెలిచి.. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు మొత్తం పూర్తిచేస్తానని ఈ సందర్భంగా సావిత్రి జిందాల్ హామీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన సావిత్రి జిందాల్ మొత్తం ఆస్తి ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీ నాటికి 39.5 బిలియన్ డాలర్లు. జిందాల్ కుటుంబానికి పలు రంగాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి.
ఇక హిస్సార్ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కమల్ గుప్తాకు బీజేపీ టికెట్ ఇవ్వడంతో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా కార్యదర్శి తరుణ్ జైన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గురువారం తన ఇంట్లో సమావేశం నిర్వహించి.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మంత్రి కమల్ గుప్తాకు హిస్సార్ నియోజకవర్గ ప్రజలు డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa