లంచం తీసుకోవడం నేరం. అయినా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవేమీ పట్టనట్టు.. బల్ల కింద చేతులు పెట్టి జనం నుంచి డబ్బులు లాగుతూనే ఉంటారు. ఇక అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఇలాంటి అక్రమార్కులను పట్టుకునేందుకు నిఘా వేసి ఉంచుతారు. లేదా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే.. దాని ఆధారంగా సదరు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ లంచాధికారులు పట్టుబడటం.. వారికి శిక్షలు పడటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వివిధ కారణాల వల్ల విచారణ వాయిదా పడుతూ ఉంటుంది. ఇక ఈ ఘటనలో మాత్రం ఓ జీవిత కాలం ఆలస్యం అయింది. 34 ఏళ్ల క్రితం లంచం తీసుకున్న ఓ పోలీస్ను అరెస్ట్ చేయాలని తాజాగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆ పోలీస్ తీసుకున్న లంచం రూ.20 కావడం గమనార్హం.
బీహార్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 1990లో బీహార్లోని సహర్సా రైల్వే స్టేషన్లో సురేష్ ప్రసాద్ సింగ్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేవాడు. ఆ ఏడాది మే 6వ తేదీన రూ.20 లంచం తీసుకుంటూ స్టేషన్ ఇంఛార్జ్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ప్లాట్ఫారమ్పై కూరగాయల మూటను తీసుకెళ్తున్న ఓ మహిళను అడ్డగించిన సురేష్ ప్రసాద్ సింగ్.. ఆమె దగ్గర నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆమె రూ.20 ఇస్తుండగా.. అప్పటి రైల్వేస్టేషన్ ఇంఛార్జ్కు దొరికిపోయాడు. దీంతో అతడు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 1999లో ఆ కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ బెయిల్పై జైలు నుంచి బయటికి రాగా.. ఆ తర్వాత పరారయ్యాడు.
దీంతో అతడి బెయిల్ రద్దు చేసిన కోర్టు.. వెంటనే అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసింది. సురేష్ ప్రసాద్ సింగ్ తప్పుడు అడ్రస్, వివరాలు ఇవ్వడంతో అతడిని పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదు. ఈ నేపథ్యంలోనే అతడిని ఉద్యోగం నుంచి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే బీహార్లోని పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరిస్తున్న నేపథ్యంలో తాజాగా అధికారులు పాత కేసులు వెలికి తీస్తుండగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కానిస్టేబుల్ లంచం కేసు కోర్టు దృష్టికి రాగా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇక 34 ఏళ్లుగా ఆ కానిస్టేబుల్ను అరెస్ట్ చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరుపరచాలని తాజాగా స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ.. బీహార్ డీజీపీకి గురువారం ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa