ఆపద వస్తే చాలు నేనున్నానంటూ అండగా నిలిచే రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెండున్నర కోట్ల చొప్పున.. రూ.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు గానూ ఈ విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే సోనూసూద్ ఫౌండేషన్ వరద బాధితుల కోసం పనిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు, మెడికల్ కిట్లు అందిస్తోంది. అలాగే ఇల్లు కోల్పోయి నిలువ నీడ కోల్పోయిన వారి కోసం తాత్కాలికంగా షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సోనూసూద్ చేస్తున్న సేవలను ఏపీ ప్రభుత్వం సైతం ప్రశంసించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సోనూసూద్ సేవలను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు.
మరోవైపు వరద బాధితులను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. దాతల నుంచి విశేష స్పందన వస్తోంది. శనివారం పలువురు దాతలు సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. వరుణ్ గ్రూపునకు చెందిన వల్లూరుపల్లి లక్ష్మీకిషోర్(వరుణ్ గ్రూప్ డైరెక్టర్), వల్లూరుపల్లి వరుణ్ దేవ్(ఎండీ) రూ.2 కోట్లు విరాళం అందించారు. అలాగే ఆర్.వీ.ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున డైరెక్టర్ శర్నాల గణేష్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఏపీ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ రూ.25 లక్షలు, డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్, సిబార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రూ.10 లక్షలు, ఎస్.ఎన్.పూర్ణిమ రూ.5 లక్షలు(ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, విజయవాడ చాప్టర్), బి.శాంతి వరలక్ష్మీ రూ.1 లక్షా 25 వేలు, టీడీపీ నేత గోనుగుండ్ల కోటేశ్వరరావు రూ.1 లక్షా 16 వేలు చొప్పున విరాళం అందించారు.
మరోవైపు పలువురు సినీ తారలు కూడా ఇప్పటికే వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించారు. హీరోలు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అగ్రహీరోలతో పాటుగా విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి జూనియర్ హీరోలు సైతం తాము ఉన్నామంటూ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించి తమ దాతృత్వ గుణం చాటుకున్నారు. ఇదే బాటలోనే బాలీవుడ్ నటుడు సోనూసూద్ సైతం విరాళం ప్రకటించారు. అలాగే తన ఫౌండేషన్ ద్వారా వరద బాధిత ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa