ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతల్ని వేధిస్తున్నారని.. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని.. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పుడు టీడీపీ నేతలకు కూడా ఇదే గతి పడుతుందని.. అప్పుడు వారంతా ఇదే జైల్లో ఉంటారన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను జగన్ పరామర్శించారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని.. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి రెడ్బుక్పైనే బాబు దృష్టి పెట్టారని.. ప్రజా సమస్యలపై దృష్టి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నారా?.. సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా ఆయన కనిపించారా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు జగన్. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడను వరద ముంచెత్తిందని.. ఉండవల్లిలో తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారని ధ్వజమెత్తారు. తన ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారన్నారు. చంద్రబాబు చేసిన ఈ దారుణానికి 60 మందికిపైగా చనిపోయారని.. అంతమంది మరణానికి కారణమైన చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టరు? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు కొత్తగా బోట్ల రాజకీయం చేస్తున్నారని.. ఆ బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చిందో చెప్పాలన్నారు.
ప్రకాశం బ్యారేజీలోకి కొట్టుకు వచ్చిన బోట్లలో.. చంద్రబాబు గెలవగానే విజయోత్సవాలు చేశారన్నారు జగన్. చంద్రబాబు, లోకేష్లతో బోటు ఓనర్ ఉషాద్రి ఫొటోలు దిగారని.. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీలోకి కొట్టుకు వచ్చిన బోట్లన్నీ టీడీపీ నేతలకు చెందినవే అన్నారు. కానీ వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని.. ప్రజలకు తోడుగా నిలవకుండా నేరాన్ని తమపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాను చేసిన తప్పుల్ని డైవర్ట్ చేసేందుకే అక్రమంగా కేసులు పెడుతున్నారని.. ఎప్పుడో జరిగిన ఘటనపై కేసును తెరపైకి తీసుకొచ్చారన్నారు. గతంలో సీఎంను దారుణంగా తిడితే ఎలాంటి కక్షసాధింపులు చేయలేదని.. కోర్టులో ప్రవేశపెట్టి 41ఏ నోటీసు ఇచ్చి పంపించారన్నారు.
చంద్రబాబు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు జగన్. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ మోసమని తేలాయని.. అసలు రాష్ట్రంలో పాలన ఉందా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నీర్వీర్యం చేసిందని.. ఇంటింటికి సేవలు ఆగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం అందలేదని.. అమ్మఒడి పథకాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్న పరిస్థితులు చూడాల్సి వస్తోందని.. ఆసుపత్రుల్లో మందులు, నర్సుల కొరత ఉందన్నారు. ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు జగన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa