ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా నిందితుడికి నార్కో పరీక్ష.. కోర్టు అనుమతి కోరిన సీబీఐ

national |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 10:33 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్ట్ 6వ తేదీన అర్ధరాత్రి.. ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును కోల్‌కతా పోలీసుల దగ్గర నుంచి తీసుకున్న సీబీఐ అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ రాయ్‌, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా మిగిలిన నిందితులకు ఇప్పటికే సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. అయినా సరైన నిజాలు బయటికి రాకపోవడంతో సంజయ్ రాయ్‌కి నార్కో టెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఇందుకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించింది.


సంజయ్ రాయ్‌ నార్కో అనాలిసిస్ టెస్ట్ కోసం.. అనుమతి కోరుతూ సెల్దా కోర్టులో ఇప్పటికే సీబీఐ పిటిషన్ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇక ఇప్పటికే చేసిన పాలీగ్రాఫ్‌ టెస్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారులు బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచారు. తాను ఏ తప్పు చేయలేదని పాలిగ్రాఫ్ టెస్ట్‌లో సంజయ్‌ రాయ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ మీడియా కొన్ని కథనాలు వెలువరించింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలోని కాన్ఫరెన్స్ హాలుకు తాను వెళ్లేసరికే అప్పటికే ఆ ట్రైనీ డాక్టర్ చనిపోయి ఉందని.. అది చూసి తాను భయంతో పారిపోయినట్లు సంజయ్ రాయ్.. పాలీగ్రాఫ్ టెస్ట్‌లో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు నిజం ఏంటో నిర్ధారించేందుకు నిందితుడికి నార్కో టెస్ట్ నిర్వహించాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. సంజయ్‌ రాయ్‌, ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌, ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు డాక్టర్లు, ఇంకో సివిల్‌ వాలంటీర్‌కు ఇటీవలే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సీబీఐ అధికారులు పాలీగ్రాఫ్‌ టెస్ట్‌లు చేశారు.


నార్కో అనాలసిస్‌ టెస్ట్‌లో భాగంగా ఒక వ్యక్తి శరీరంలోకి సోడియం పెంటోథాల్‌, స్కోపలామైన్‌, సోడియం అమైథాల్‌ వంటి ఔషధాలను పంపిస్తారు. వీటన్నింటి ఈ మిశ్రమాన్ని ట్రూత్‌ సీరం అని పిలుస్తారు. అయితే ఈ ట్రూత్ సీరం ఇచ్చే వ్యక్తి.. వయసు, ఆరోగ్యం, శరీర పుష్ఠి ఆధారంగా డోసును ఎక్కిస్తారు. ఈ ట్రూత్ సీరం ఎక్కించిన కొన్ని సెకన్లలోనే సదరు వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఆ సమయంలో నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు.


మామూలుగా అడిగినపుడు చెప్పని విషయాలు కూడా ఈ ట్రూత్ సీరం ఎక్కించిన తర్వాత చెబుతాడని నిపుణులు వెల్లడిస్తారు. ఈ సమయంలో ఆ వ్యక్తిపల్స్‌, బీపీని డాక్టర్లు పర్యవేక్షించి.. ఒకవేళ అవి పడిపోతే.. వెంటనే ఆక్సిజన్‌ అందిస్తారు. ఈ నార్కో టెస్ట్‌ను నిందితులకు నిర్వహించాలంటే.. కోర్టుతోపాటు సదరు నిందితుడి అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఇక నార్కో టెస్ట్‌లో నిందితుడు చెప్పే విషయాలను కోర్టులు సాక్ష్యాలుగా పరిగణించకపోయినప్పటికీ.. కేసు దర్యాప్తుకు ఉపయోగపడతాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa