తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. ఇక వీకెండ్ సమయాలు, పర్వదినాల రోజుల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే తిరుమల శ్రీవారి దర్శనం కోసం మంత్రులు, వీఐపీలు, వీవీఐపీలూ కూడా వస్తుంటారు. తాజాగా ఏపీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కూడా అలాగే వచ్చారు. అయితే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఆయనకు ఓ భక్తుడు తిరుమలలో ఏర్పాట్లపై ఫిర్యాదు చేశారు.ఆదివారం నుంచి క్యూ లైనల్లో ఉన్నామని.. చివరకు పిల్లలతో క్యూలైన్లలో ఉండలేక బయటకు వచ్చేశామని చెప్పారట. శ్రీవారి దర్శనం చేసుకోలేకపోయానని మంత్రికి ఫిర్యాదు చేయడంతో.. అధికారులతో మాట్లాడి దర్శనం చేయిస్తానని ఆనం రాంనారాయణరెడ్డి హామీ ఇచ్చారట. అయితే.. ఆలయం దగ్గరే దేవాదాయ శాఖ మంత్రికి భక్తుడు నేరుగా ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే భక్తుడి ఫిర్యాదుపై టీటీడీ స్పందించింది. మంత్రికి భక్తుడి ఫిర్యాదును సీరియస్గా తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుడి ఫిర్యాదు తర్వాత సీసీటీవీ ఫుటేజీ ద్వారా పరిశీలిస్తే అన్నప్రసాదం, పాలు, మజ్జిగ వితరణలో ఎలాంటి లోపం లేదని తేలిందని చెప్పారు.కంప్లైంట్ ఇచ్చిన భక్తుడు అన్నప్రసాదం, పాలు తీసుకున్న దృశ్యాలు నమోదు అయ్యాయని ఈవో తెలిపారు. సదరు భక్తుడు 10:45కి కృష్ణతేజ అతిథి గృహం వద్ద క్యూలైన్ లోకి ప్రవేశించారనీ.. రాత్రి 11 గంటలకి అన్నప్రసాదం, ఉదయం 6 గంటలకు పాలు, 8 గంటలకు టిఫిన్, 10కి పాలు తాగినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉందని ఈవో వివరించారు. ఆ తర్వాత 10:45కి బయటకు వచ్చి మంత్రికి ఫిర్యాదు చేశారని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందన్న కోపంలో అలా చెప్పమని భక్తులు క్షమాపణ చెప్పినట్లు తెలిపారు.తిరుమలలో భక్తులకు సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి టీటీడీ సిద్ధంగా ఉందని ఈవో తెలిపారు.
మరోవైపు నారాయణగిరి ఉద్యానవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సర్వదర్శనం క్యూలైన్లో భక్తులకు నిర్విరామంగా అన్నప్రసాదం.. పాలు, మజ్జిగలు అందిస్తున్నామని ఈవో చెప్పారు. గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని.. ఇందుకోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టం సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు. శుక్ర, శని అధికారాల్లో అధిక రద్దీ కొనసాగుతూ ఉంటుందని చెప్పారు. లడ్డూ నాణ్యతపై భక్తులు మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్న ఈవో.. లడ్డూ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa