ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలుచేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యా్స్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హమీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది.
మరోవైపు ఎన్డీయే శాసనసభాపక్ష భేటీలో వైఎస్ జగన్ తీరుపైనా, వైసీపీ విధానాలపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. కోట్లల్లో పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో డబ్బులు లేవన్న చంద్రబాబు.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. అయినా కూడా కేంద్రం సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మంచిపనులకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ఈ నెల 20 నుంచి 26 వరకూ నియోజకవర్గంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. మరోవైవు వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తిచేస్తామన్న చంద్రబాబు.. విశాఖ రైల్వే జోన్కు కూడా త్వరలోనే కేంద్రం శంకుస్థాపన చేస్తుందన్నారు. అమరావతి నిర్మాణానికి కూడా ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa