బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-బీఎస్ఎఫ్కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అమరులు అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రత కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్ కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 7 బస్సులు కాన్వాయ్గా బయల్దేరగా.. మార్గమధ్యలో బ్రెల్ గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న 40 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. మరో 32 మంది గాయపడగా.. అందులో ఆరుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇక బీఎస్ఎఫ్ బస్సు భారీ లోయలో పడిందని తెలుసుకున్న బ్రెల్ గ్రామస్థులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక అందులో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సెప్టెంబర్ 18వ తేదీన తొలి దశ పోలింగ్ పూర్తయింది. రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25వ తేదీన జరగనున్నాయి. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం గమనార్హం. పైగా ఇటీవల గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa